“తెలుగు మహాభారతం – సభా పర్వం” పై ప్రసంగం

“తెలుగు మహాభారత సహస్రాబ్ది ఉత్సవాల” సందర్భంగా శ్రీ రేమెళ్ళ అవధానులు గారిచే హైదరాబాదులో మోతీనగర్ శృంగేరి శంకరమఠంలో 3 నవంబర్ 2022 నాడు నిర్వహించబడిన “ఆదికవి నన్నయ విరచిత తెలుగు మహాభారతం – సభా పర్వం” పై నా ప్రసంగాన్ని వీక్షించండి.
– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రహేళిక – ఒక గత స్మృతి!

పది, పదిహేనేళ్ళ క్రిందట నేను, సాహితీ మిత్రులు శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు, శ్రీమతి జ్యోతి వలబోజు గారు, శ్రీ కంది శంకరయ్య గారు ప్రభృతులు తెలుగులో తొలితరం బ్లాగర్లుగా రాణించిన వాళ్ళం.

నిన్న ఎందుకో పాత బ్లాగులన్నీ ఒకసారి చూద్దామనిపించింది. అప్పుడు ఒక పోస్ట్ నా కంటబడి, చాల ఆనందం కలిగింది …
సరిగ్గా … పుష్కర కాలం క్రిందటి దీపావళి పండుగ సమయంలో కంది శంకరయ్య గారు తన “శంకరాభరణం” బ్లాగులో నాపై ఒక “ప్రహేళిక”ను రూపొందించి పోస్టు చేసారు. దానికి సమాధానాన్ని ఇస్తూ .. చాల మంది కామెంట్లు పెట్టారు. ఆ కామెంట్లలో నేనూ పద్యరూపంలో స్పందించాను.

అదంతా .. ఈ క్రింద పొందుపరిచాను.
గమ్మత్తుగా .. మీరూ ఒకసారి గమనించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

           శంకరాభరణం
         ##########

5, నవంబర్ 2010, శుక్రవారం

            ప్రహేళిక - 27
          ~~~~~~~~~
            ఎవరీ బ్లాగరి?
         """"""""""""""""""'"""""

ఆ.వె.
పడగ యున్న దొకటి పవిధారి యొకఁడు స
వర్ణదీర్ఘ సంధి వలనఁ గలియ
నాంధ్ర పద్య కవిత కాచార్యుఁడై బ్లాగు
లందు మెరయు డాక్ట రతఁ డెవండు?

ఆ బ్లాగరి ఎవరో చెప్పండి.

               - కంది శంకరయ్య 

14 కామెంట్‌లు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी
శుక్రవారం, నవంబర్ 05, 2010 8:44:00 AM
డాక్టర్ ఆచార్య ఫణీంద్ర

గన్నవరపు నరసింహమూర్తిశుక్రవారం,
నవంబర్ 05, 2010 10:38:00 AM
డాక్టరు ఆచార్య ఫణీంద్ర గారు

రవి
శుక్రవారం, నవంబర్ 05, 2010 11:55:00 AM
ఆచార్య ఫణీంద్ర?

SRRao
శుక్రవారం, నవంబర్ 05, 2010 1:19:00 PM
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

  • శి.రా.రావు
    శిరాకదంబం

రాజేశ్వరి నేదునూరి
శుక్రవారం, నవంబర్ 05, 2010 4:34:00 PM
మిత్రు లందరికి దీపావళి శుభా కాంక్షలు

“డా . ఆచార్య ఫణీంద్ర గారు” [ javaabu ]

చంద్రశేఖర్
శుక్రవారం, నవంబర్ 05, 2010 9:27:00 PM
ఆచార్య ఫణీంద్ర (ఫణి + ఇంద్ర)

mmkodihalli
శనివారం, నవంబర్ 06, 2010 5:42:00 AM
ఇష్ట సఖి అధరమ్ము జూచి మోహించు
నికృష్ట జీవుల రుధిరమ్ము గాంచి విలపించు
కష్ట సుఖములకు స్పందించి కదలు
ఉత్కృష్టమైన కలమెవరిదొ?

అట్టివారె డాక్టర్ ఆచార్య ఫణీంద్ర.

మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
శనివారం, నవంబర్ 06, 2010 7:33:00 AM
డా.ఆచార్య ఫణీంద్ర

  • మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

డా.ఆచార్య ఫణీంద్ర
శనివారం, నవంబర్ 06, 2010 10:58:00 PM
ఇప్పుడ చూచినాడను – ప్రహేళిక నొక్కటి నాదు పేరుపై
అప్పటికప్పు డల్లి ఇటు లందగ జేసెను శంకరార్యుడున్ –
చప్పున నుత్తరం బిడుచు చాటిరి ప్రేమను పండితోత్తముల్ –
ఎప్పటి పుణ్యమో గదిది ! ఎల్లరకున్ తల వంచి మ్రొక్కెదన్!

కంది శంకరయ్య
సోమవారం, నవంబర్ 08, 2010 6:29:00 AM
మందాకిని గారూ,
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రవి గారూ,
నేదునూరి రాజేశ్వరి గారూ,
చంద్రశేఖర్ గారూ,
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
మీ అందరి సమాధానం సరియైనదే. అభినందనలు.

కంది శంకరయ్య
సోమవారం, నవంబర్ 08, 2010 6:31:00 AM
కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
మీకు ప్రత్యేకంగా అభినందనలు.

కంది శంకరయ్య
సోమవారం, నవంబర్ 08, 2010 6:58:00 AM
“శిరాకదంబం” రావు గారూ,
ధన్యవాదాలు.

కంది శంకరయ్య
సోమవారం, నవంబర్ 08, 2010 6:59:00 AM
డా.ఆచార్య ఫణీంద్ర గారూ,

ధన్యవాదాలు.

“విలీనమా? విమోచనమా? విద్రోహమా?” – నా అభిప్రాయం! – డా. ఆచార్య ఫణీంద్ర

ఈ రోజు సెప్టెంబర్ 17 ..

1948 లో ఇదే రోజు నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ స్వాతంత్ర్యం పొందిన రోజు.
అయితే … “అది విలీనమా?
విమోచనమా? లేక విద్రోహమా?” అన్నది గత అరవయ్యేళ్ళుగా ప్రతి సంవత్సరం చర్చ జరుగుతున్నా … ఆ చర్చ ఫలితం తేలకుండానే కాలం గడచిపోవడం .. మరుసటి సంవత్సరం మళ్ళీ అదే చర్చ జరుగడం సర్వ సాధారణమై పోయింది.
కారణం … అది వివిధ పార్టీల దృక్పథం, వారి వారి అనుకూలుర ఆలోచనా విధానం నిష్పాక్షికంగా లేకపోవడమే!

  1. మితవాద కమ్యూనిస్టులు ఇది విమోచనం అంటారు.
  2. అతివాద కమ్యూనిస్టులు ఇది విద్రోహం అంటారు.
  3. హిందూ మతవాదులు ఇది విమోచనం అంటారు.
  4. ముస్లీం మతవాదులు ఇది విద్రోహం అంటారు.
  5. లౌకికవాదులు ఇది విలీనం అంటారు.

మొదటి నాలుగు సమూహాలలో ఆ యా భావజాలాల వారే ఉంటారు. లౌకిక వాదులలో హిందువులు, ముస్లిములు, కమ్యూనిస్టులు అందరూ ఉంటారు. అందరి పట్ల సమభావన కలిగి ఉండడమే వారికి ప్రాతిపదిక. కాబట్టి వారి భావనయే ప్రామాణికమని నా భావన.

కానీ .. నేను దీనిని సమర్థిస్తే కాంగ్రెస్ వాదిననో .. లేక ప్రస్తుత టి.ఆర్.ఎస్. వాదిననో ముద్రవేయకండి.

ఈ వాదాలన్నీ కాసేపు ప్రక్కన పెట్టండి. అసలు ఒక రాజ్యం మరొక రాజ్యంలో కలిసిపోయినప్పుడు అది విలీనమో, విమోచనమో, విద్రోహమో .. ఎట్లా నిర్ణయించగలం?

కొన్ని ఉదాహరణలు చెప్పుతాను .. చూడండి … అప్పుడు మీరే – అది విలీనమా, విమోచనమా, విద్రోహమా … నిర్ణయించగలుగుతారు.

ఒకటి ..
ఒక రాజ్యంలో ఒక రాజు పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. అప్పుడు మరొక పెద్ద రాజ్యం సామ్రాజ్య విస్తరణ కొరకో లేక మరొక కారణంతోనో దండెత్తి ఆక్రమించుకొంటే .. అది ‘విద్రోహం’ అవుతుంది.
ఈ భావనతోనే .. అతి కొద్దిమంది ముస్లిం మతవాదులు దీనిని ‘విద్రోహం’ అంటారు.
కొంతమంది అతివాద కమ్యూనిస్టులు కూడ ఇది విద్రోహం అనే వారున్నారు. వారి భావన ప్రకారం .. సాయుధ పోరాటం ద్వారా కమ్యూనిస్టులు నిజాం మరియు రజాకార్ల నుండి విముక్తి సాధించి, ప్రత్యేక కమ్యూనిస్ట్ దేశం ఏర్పర్చాలనుకొంటే .. మధ్యలో భారత సైన్యం వచ్చి ఆక్రమించుకోవడం ‘విద్రోహం’. అట్లాంటి వారు కొందరు ఆ రోజుల్లో రష్యాకి వెళ్ళి స్టాలిన్ ను సహాయం చేయుమని అర్థించారని కూడ వినికిడి.

ఏమైనా .. అత్యధిక తెలంగాణ ప్రజలు భారత్ లో కలిసిపోవాలని కోరుకొన్నారు గానీ .. నిజాం రాజ్యంలో కొనసాగాలని గానీ, ప్రత్యేక కమ్యూనిస్ట్ దేశంగా ఏర్పడాలని గానీ కోరుకోలేదు కదా! కాబట్టి .. ఇది ఎట్టి పరిస్థితులలో విద్రోహం కానేరదు. కాబట్టే .. ఈ వాదం కొన్నాళ్ళుగా కాస్త బలహీనపడి … కేవలం “విలీనమా? విమోచనమా?” అన్న చర్చ మాత్రమే బలంగా వినిపిస్తున్నది.

రెండు …
ఇక ‘విమోచనం’ అంటే ఏమిటి? .. పరిశీలిద్దాం.
ఒక రాజ్యంలో ప్రజలు నానా కష్టాలను పడుతున్నారు. ఆ రాజు పట్ల అత్యధిక ప్రజలు విముఖంగా ఉన్నారు. కొందరు ప్రజా సేవకులు, దేశ భక్తులు ఆ రాజును గద్దె దింపడానికి ప్రాణ త్యాగానికి సిద్ధమై పోరాడుతున్నారు. ఆ రాజు ఆ వీరులందరినీ కర్కషంగా అణచివేస్తున్నాడు. అప్పుడు ఆ రాజ్యంలోని తిరుగుబాటు దండో .. లేక ఆ రాజ్య ప్రజలకు సహాయం చేయగోరి పొరుగున ఉన్న బలమైన రాజ్యం యొక్క సైన్యమో .. యుద్ధం చేస్తూ .. ఒక్కొక్క నగరాన్ని ఆక్రమిస్తూ … సంపూర్ణంగా ఆక్రమించుకొని, ఆ రాజును సంహరించడమో .. లేక రాజకీయ బందీ చేసి, అధికారికంగా ఆ రాజ్య ప్రజలకు విముక్తిని కలిగించిన విషయం ప్రకటిస్తే .. అది కచ్చితంగా ‘విమోచనమే’ అవుతుంది. ఆ రోజుల్లో కొంతవరకు ఇదే జరుగబోతుందని అందరూ ఊహించారు. ఇప్పటికీ కొంత మంది ఇదే జరిగిందని ఊహిస్తూ, వాదిస్తున్నారు. కాని ఇది పాక్షిక సత్యమే .. చివరలో నిజాం రాజు ఓటమి తప్పదని గ్రహించి, ప్రజాభీష్టానికి తల ఒగ్గి తీసుకొన్న నిర్ణయం .. దానిని ‘విమోచనం’ కాకుండా ‘విలీనం’ గా మార్చివేసింది. పైగా .. యుద్ధ విరమణానంతరం ఆ రాజ్యం స్వతంత్ర దేశంగా ఉంటే .. అది ‘విమోచనం’ అయ్యేది. కాని తెలంగాణ ప్రజలు మొదటి నుండి భారత సామ్రాజ్యంలో ‘విలీనం’ కావాలనే కోరుకొన్నారు. కాబట్టి ఇది ఎంత మాత్రం ‘విమోచనం’ కానేరదు. ‘విలీనమే’!
అది ఎట్లాగో ఇంకా వివరంగా పరిశీలిద్దాం.

మూడు …
తెలంగాణ ప్రజలు భారత స్వాతంత్ర్య సాధన అవకాశాలను నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నారు. ఇతర గణ రాజ్యాల ప్రజల లాగే ..ఇక్కడి ప్రజలకు కూడ భారత దేశం స్వాతంత్ర్యాన్ని సాధిస్తే .. అందులో తాము కూడ ‘విలీనం’ కావాలని కోరిక అంకురించింది. ఆ భావనలు ప్రజల నుండి వ్యక్తం కావడం ప్రారంభమవగానే నిజాం రాజు కఠినాత్ముడుగా మారి, ప్రజాకాంక్షను అణచివేయడానికి పూనుకొన్నాడు. అంతకు ముందు ఆ రాజు ఆ ప్రజలను మరీ గొప్పగా కాకపోయినా, బాగానే చూసుకొన్నాడు. ప్రజల కొరకు అనేక ఆధునిక వసతులను సమకూర్చాడు. ప్రజల విద్యావసరాలకై ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాడు. ఉస్మానియా ఆసుపత్రితోబాటు అనేక ప్రభుత్వ వైద్యాలయాలను నిర్మించాడు. త్రాగు నీటి అవసరాల కోసం గండిపేట్ నీటి ప్రాజెక్టును కట్టించాడు. బ్రిటిష్ వారికి దీటుగా ఇక్కడ కూడ ప్రజా రవాణా అవసరాల కోసం రైల్వే మార్గాలను, బస్సు ప్రయాణ సౌకర్యాలను ఏర్పరిచాడు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం హైకోర్టును (అది నిజాం రాజ్యపు సుప్రీంకోర్టు) అందుబాటులోకి తెచ్చాడు. అనేక హిందూ దేవాలయాలకు ఆర్థిక సహాయం చేసాడు. తన దృష్టికి వచ్చిన ప్రతిభావంతులయిన పేద విద్యార్థులకు ఇంగ్లండ్ వెళ్ళి ఉన్నత విద్యలు చదివేందుకు ఆర్థిక సాయం చేసాడు. ఇంకా .. చాల .. చాల చేసాడు. అందుకు నిజాం రాజు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు కావడం కూడ దోహదం చేసింది. కాబట్టి 1930 .. 1935 వరకు ప్రజలు మరీ సంతోషంగా ఉన్నారని చెప్పలేక పోయినా (మధ్యలో జమీందారుల దోపిడి, అరాచకం కొంత ఉండింది కదా!), నిజాం రాజు పట్ల అసంతృప్తిగా లేరు. కాబట్టి అది ఆనాటికి ‘విమోచనం’ అన్న పదానికి ఎంత మాత్రం తావీయదు. కానీ … ఆ తరువాత అత్యధిక తెలంగాణ ప్రజలు తామూ భారతీయులుగా జీవించాలన్న ఆకాంక్షతో ‘విలీనం’ పై మొగ్గు చూపారు. రాను రాను అది మరింత బలపడుతూ వచ్చింది. తాను ఇంత చేస్తున్నా .. ప్రజలలో వస్తున్న మార్పును నిజాం రాజు తట్టుకోలేక పోయాడు. అక్కడే మొదలయింది అసలు కథ!

తెలంగాణ ప్రజల ‘విలీనం’ ఆకాంక్ష తన రాజ్యాధికారానికే ముప్పు అని గ్రహించగానే నిజాం రాజు పూర్తి నిరంకుశునిగా మారాడు. విలీనం ఆకాంక్షతో గళమెత్తిన కవులను, నాయకులను కఠిన కారాగార శిక్షకు గురి చేసాడు. కఠినమైన ఆంక్షలతో ప్రజల గొంతులను నొక్కే ప్రయత్నం చేసాడు. ముస్లిం రాజ్యాన్ని కాపాడుకోవాలనుకొనే ముస్లిం మత అతివాదులయిన రజాకార్లనే ప్రైవేట్ సేనలను ప్రోత్సహించాడు. వారి అరాచకాలకు హద్దు అదుపు లేకుండా కొనసాగనిచ్చాడు. అప్పుడు హిందువులంతా తిరుగబడసాగారు. మరొక వైపు కమ్యూనిస్టుల సాయుధ పోరాటం, జమీందార్ల దారుణాలపై తిరుగబడ్డ రైతాంగ పోరాటాలు విజృంభించాయి. తన అదుపు తప్పుతుందన్న భయంతో .. నిజాం రాజు హత్యాకాండలకు వెనుకాడలేదు. ఎక్కడ చూసినా అశాంతి .. అల్లకల్లోలం … తెలంగాణ ప్రజలకు ‘విలీనం’ కన్న ముందు ‘విమోచనం’ ప్రధానమయ్యింది. మరొక ప్రక్క తెలంగాణలోని ముస్లిం అతివాదులు, రజాకారులు క్రొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ సాయాన్ని అర్థించారు.
ఆ సమయంలో అప్పుడే స్వాతంత్ర్యం సాధించిన భారత దేశం కూడ పరిస్థితులను గమనించక తప్పని పరిస్థితి ఏర్పడింది. భారత ఉపప్రధాని సర్దార్ పటేల్ నిజాం రాజ్యంపై సైనిక చర్యకు పూనుకొన్నారు. “ఆపరేషన్ పోలో” పేరిట భారత సైనికులు నిజాం రాజ్యంపై దండెత్తారు. నిజాం రాజ్యం సైనికులు, రజాకార్లు సమ ఉజ్జీగా ప్రతిఘటించలేక పోయారు. భారత సైనికులు నిజాం రాజ్యంలోని ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమిస్తూ ముందుకు దూసుకు వస్తున్నారు. అదే కొనసాగి సంపూర్ణ విజయం సాధించి, నిజాం రాజును భారత సైనికులు బంధించి ఉంటే … అది ‘విమోచనం’గా భావించ గలిగి ఉండేవాళ్ళం. కాని అక్కడే నిజాం రాజు పరిస్థితులను అర్థం చేసుకొని ఒక ‘ట్విస్ట్’ ఇచ్చాడు. ప్రజాభీష్టాన్ని అంగీకరించి తన రాజ్యాన్ని భారతదేశంలో ‘విలీనం’ చేస్తున్నట్టుగా ‘దక్కనీ రేడియో’ ద్వారా ప్రకటించాడు. యుద్ధం విరమించబడింది. భారత సేనలను తరువాత స్వేచ్ఛగా నిజాం ప్రభుత్వం లోనికి స్వాగతించింది. భారత సేనలకు సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్స్ వద్ద తెలంగాణ ప్రజలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఇక విమోచనం అన్న ప్రస్తావన ఎక్కడిది? – చెప్పండి.

  1. నిజాం రాజు భారత ఉపప్రధాని సర్దార్ పటేల్ ను హైదరాబాదుకు ఆహ్వానించి, బేగంపేట విమానాశ్రయంలో స్వయంగా వెళ్ళి సాదర స్వాగతం పలికి ‘విలీనం’ చేస్తున్నట్లుగా అధికారిక పత్రాన్ని సమర్పించాడు.
  2. భారత ప్రభుత్వం తరఫున సర్దార్ పటేల్ నిజాం రాజ్యాన్ని భారత దేశంలో ‘విలీనం’ చేసుకొంటున్నట్టుగా అధికారకంగా ప్రకటించారు.
  3. అటు పిమ్మట నిజాం రాజును – భారత దేశంలో ‘విలీనం’ అయి, క్రొత్త రాష్ట్రంగా ఏర్పడిన “హైదరాబాద్ రాష్ట్రా”నికి ‘రాజ్ ప్రముఖ్’ (ఈనాటి గవర్నర్ పదవితో సమానం) గా భారత ప్రభుత్వం నియమించింది.
  4. నిజాం ప్రభుత్వానికి ఆనాడు అనుకూలంగా పనిచేస్తూ, రజాకార్ల అధినేత అయిన ఖాసిం రజ్వీ అధ్యక్షత వహించిన MIM పార్టీ ‘విలీనం’ తరువాత, భారత దేశంలోని ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో, అటు తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆ పైన ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ఒక రాజకీయ పార్టీగా రాణిస్తూ .. ఏడు దశాబ్దాలుగా ఎందరో ఎమ్మెల్యేలను, ఎంపీలను ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలిపించుకొంటూ వస్తున్నది.
  5. అంతే కాదు … 1967లో నిజాం రాజు మరణించినప్పటి సన్నివేశ వివరాలను పరికించండి –
    He died on Friday, 24 February 1967. In his will, he asked to be buried in Masjid-e Judi, a mosque where his mother was buried, that faced King Kothi Palace. The then Andhra Pradesh government declared state mourning on 25 February 1967, the day when he was buried. State government offices remained closed as a mark of respect while the National Flag of India was flown at half-mast on all the government buildings throughout the state.
  6. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా ఎన్టీయార్ టాంక్ బండ్ పై నిజాం రాజు విగ్రహం పెట్టి గౌరవించారు.
  7. యుద్ధనీతిలో సంధి ఒక భాగం. సంధి చేసుకొన్న రాజు తప్పులను క్షమించడం రాజ ధర్మం. అదే భారత ప్రభుత్వం చేసింది. భారత పౌరులుగా మనం దానిని గౌరవించాలె.
  8. ఒక వైపు గౌరవిస్తూ .. మరొక వైపు ఆయన నుండి ‘విమోచనం’ పొందామనడం ఎంతవరకు సముచితం?
  9. పై విషయాలన్నీ అధికారికంగా జరిగాక, అది ‘విలీనమే’ అవుతుంది కానీ .. ‘విమోచనం’ ఎట్లా అవుతుంది?
    పైగా .. మరణించినప్పుడు ఏ నిజాం రాజయితే అంతటి గౌరవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి పొందాడో .. ఆ రాజు నుండి ఈ రాష్ట్రం ‘విమోచనం’ పొందింది అనడం ఏ విధంగా సముచితం?
    అంతే కాదు .. విలీనమయ్యాక కూడ తన ట్రస్ట్ ద్వారా నిజాం రాజు తెలంగాణలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించాడు.
  10. వినోబా భావే భూదానోద్యమానికి తన స్వంత ఆస్తిలోని వేల ఎకరాలను దానం చేసాడు.
  11. నిజాం ఆర్థోపిడిక్ ఆసుపత్రి (ప్రస్తుతం ఇది “నిమ్స్” పేరిట ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ప్రజలకు ఉన్నత స్థాయి వైద్యం అందజేస్తున్న పెద్ద విద్యాలయం) ను నెలకొల్పాడు.

తన రాజ్యాన్ని భారత దేశంలో విలీనం చేసి, కేంద్ర ప్రభుత్వంచే రాజ్ ప్రముఖ్ గా నియమింపబడి, ఒక భారత పౌరునిగా తన అనేక ఆస్తులను దానం చేసి, అనేక సేవా కార్యక్రమాలను చేసి, మరణించినపుడు ప్రభుత్వ లాంఛనాలతో సాగిపోయిన నిజాం రాజు గూర్చి వివరాలు తెలియని వారు .. ఇంకా అది ‘విమోచనం’ అని వాదిస్తూ ఉంటారు. కానీ నిజానికి …
అది విలీనమే! విలీనమే!! విలీనమే!!!



జూన్ మాసాంతం నుండి జూలై మాసాంతం వరకు …

అమెరికా నుండి 12 జూన్ 2022 నాడు వచ్చాక .. జూలై మాసాంతం వరకు వివిధ సాహిత్య కార్యక్రమాలతో బిజీబిజీగా గడచి కాలం చాల ఆనందంగా సాగింది.

ముందుగా జూన్ 25 నాటి సాయంత్రమ్ తి.తి.దే. అన్నమాచార్య ప్రాజెక్ట్ వ్యవస్థాపక సంచాలకులు –

స్వర్గీయ కామిశెట్టి శ్రీనివాసులు గారి జయంతి ఉత్సవ సభలో ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించాను.

27 జూన్ నాడు మా గురువు గారు స్వర్గీయ నండూరి రామకృష్ణమాచార్య శతజయంతి ఉత్సవాల పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొని విలేకరులకు వివరాలను వివరించడం జరిగింది.

జూన్ 28, 29, 30 తేదీలలో మూడు రోజుల పాటు జరిగిన చి. గన్నవరం లలితాదిత్య శతావధానంలో “నిషిద్ధాక్షరి” అంశంలో పృచ్ఛకునిగా వ్యవహరించాను.

అట్లా జూన్ చివరి వారమంతా బిజీగా ఆనందంగా సాగింది. ఇక జూలై మాసం మరింత బిజీగా మహానందంగా సాగింది. ఆ వివరాలను తరువాతి పోస్టులలో తెలియజేస్తాను.

రంగనాయకీ! వందనము!

ఇటీవల “ఆండాళ్ తిరునక్షత్ర” పర్వదినం నాడు నేను రచించి, స్వరాలు కూర్చి గానం చేసిన గీతాన్ని వీక్షించండి.
(వీడియో కూర్పు : చి. రోహిత్ గోవర్ధనం)

‌‌ ‌‌ – డా. ఆచార్య ఫణీంద్ర

విశ్వాసము

విశ్వాసము
“”””””””””””””””’
రచన : డా. ఆచార్య ఫణీంద్ర
~~~~~~~~~~~~~~~~~
ఉద్యోగ మాశించి ఉద్యమించిన వాని
గుండెలో బుల్లెట్టు గ్రుచ్చు వాడు
ఉద్యోగియే! అది ఉద్యోగ ధర్మమే!
ఉద్యోగమే మధ్య నున్న గీత!
ఒకడు గీత కిటువై పుండె – నా గీత కిం
కొక్కండు నటువైపు నుండె గాదె!
ఎవరు చేసిన తప్పు? ఎవరి కాయెను ముప్పు?
తుదకు ప్రాణ మొకటి తొలగె భువిని!

అమలు చేయు ముందు నా నిర్ణయము గూర్చి
విషయ వివరణమ్ము వెళ్ళబుచ్చి
విధిగ, దేశ జనుల విశ్వాసమును పొందు
పద్ధ తెరుగనట్టి ప్రభుత వచ్చె!

మొదట “నోట్ల రద్దు”; పిదప “రైతుల చట్ట”;
మటులె యిపుడు యువత “కగ్ని పథము”!
ప్రజలలో అశాంతి ప్రజ్వరిల్లగ జేసె!
తప్పు మీద తప్పు … తప్పు గాదె? #

“మిథాలి రాజ్”

భారత మహిళా క్రికెట్ జట్టు నాయకురాలు

“మిథాలి రాజ్”

క్రీడా విరమణ ప్రకటన సందర్భంగా –
అభినందన పద్య మాలిక
“””””””‘””””””””””””””””””””””””””””
రచన : డా. ఆచార్య ఫణీంద్ర
~~~~~~~~~~~~~~~~~~~

బాలిక వోలె వచ్చి యొక ప్రౌఢగ “భారత జట్టు” నందునన్
వేలకు వేల పర్గులిడి, విశ్వమునం దొక వీర నారిగాన్
“స్త్రీల క్రికెట్టు” క్రీడను ప్రసిద్ధిని బొందితివో “మిథాలి రాజ్”!
ఖేలనమందు నీదు ఘన కీర్తికి గొన్ము – శుభాభినందనల్!

“వండే మ్యాచ్” పరుగులలో
దండిగ – విశ్వమున మొదటి స్థానము నీదే!
ఇండియ సన్మానించెను
పండిన నీ ప్రతిభకు తగు “పద్మశ్రీ”తో

ఆడినా “విరువది మూడు వర్షముల”పై!
నాయకత్వము నిడినా వొక “పద
హారు వత్సరములు”! అందుకొంటి “ద్విశతి”న్*!
విరమణ మొనరించు వేళ – జయతు! #

*(Double Century in Test Match)

జన చేతనము

జన చేతనము
“”””””””””””””””””””””’
రచన : “పద్య కళా ప్రవీణ”, “కవి దిగ్గజ”
డా. ఆచార్య ఫణీంద్ర
~~~~~~
లంకా దహనం బప్పు డ
హంకృతు, డరి గర్వ మణచ హనుమ యొనర్చెన్!
లంకను దహించి రిప్పుడు
లంకా ప్రజలె అసమర్థ ప్రభువును దింపన్!

ఆర్థిక దుస్థితినిన్ – పర
మార్థ మనో వికసనమ్మె అగుపించె ప్రజన్!
అర్థం బమరు ..! వెడలు …! ని
స్వార్థ జన హిత స్ఫురణము జనులకు మేలౌ!

నూతన పాలకు డిక ‘జన
చేతనము’ ను మదిని నిల్పి, సేయు సమృద్ధిన్!
ఏ తరమున, నెవరి కయిన –
ఈ తత్త్వము బోధపడుట ఎంతయొ హితమౌ! #

అల్లూరి సీతారామరాజు

నిన్న RRR చిత్రం చూసాను. సినిమా బాగుంది. కానీ, అల్లూరి సీతారామరాజు పాత్ర విషయంలో “ఫిక్షన్” పేరిట మరీ ఎక్కువ లిబర్టీ తీసుకొన్నారనిపించింది. కొంతవరకు ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని తగ్గించినట్టు అనిపించింది. స్వాతంత్ర్య సమరానికి వలసిన ఆయధాల సమీకరణ కొరకు అల్లూరి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ పోలీస్ స్టేషన్లపై దాడి చేసాడన్నది చరిత్ర! దానిని మరొక విధంగా మార్చడం కొంచం అదోలా అనిపించింది.

ఈ సందర్భంగా .. ముప్పదేండ్ల క్రితం నేను విప్లవ వీరుడు అల్లూరిపై రచించిన ఖండ కావ్యం స్మృతిపథంలో మెదిలింది. ఆ పద్యకవితను మీరూ మరొకమారు ఆస్వాదించండి.

ఎర్ర తామర పువ్వు
~~~~~~~~~~~~~~
రచన : ”పద్య కళా ప్రవీణ”, “కవి దిగ్గజ”
డా. ఆచార్య ఫణీంద్ర
“””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
నల్లని గడ్డమున్, సునయనంబుల కుంకుమ కాంతి, చేతిలో
విల్లును గల్గినట్టి ఘన విప్లవ వీరుడు; భారతాంబకున్
తెల్లని వారి ఆగడము తీర్చగ దీక్షను బూనినట్టి ఆ
”అల్లురి రామరా” జితడె ! అంజలి సేయరె గారవించుచున్ !

నేటికి నూర్వత్సరముల
చాటున పరికింప _ ఆంధ్ర చరిత పుటలలో
మేటి, స్వరాజ్యముకై పో
రాటము సేయంగ రామరాజై పుట్టెన్ !

చదువుతోబాటుగా స్వారాజ్య కాంక్షనే
అమిత శ్రద్ధ గలిగి అభ్యసించె _
బెంగాలు, పంజాబు పెద్దలన్ దర్శించి
స్వాతంత్ర్య సంగ్రామ సంగతి గనె _
పస గల్గు ప్రాయమ్ము పణమొడ్డి, ఆంగ్లేయ
ప్రభుత నణచివేయ ప్రతిన బూనె _
వలచిన దానినిన్, వైవాహికాదులన్
వదలి వనాంతర వాసియయ్యె _

గిరిజనావళి నొక గీతపై నిలబెట్టి,
తాను గూడ చేత ధనువు బట్టి,
సైన్య మొకటి జేసి, సమర శంఖము నూది
ఆంగ్ల ప్రభుత గుండె లదరగొట్టె _

”మిరప సందేశము”ల జైళ్ళ మీద పంపి,
దాడి వార్తల పుట్టించి ”దడ దడ” లను;
అటులె దండెత్తి, గొనిపోయి ఆయుధముల,
ప్రక్కలో బల్లెమయె నాంగ్ల పాలకులకు _

”చిప్పలు చేతబట్టి ఇట చేయగ వర్తక మేగుదెంచి, మా
తప్పుల కారణాన మము దాసుల జేసియు నేలుచున్న మీ
గొప్పలు చాలునింక ! మిము గొంతులు కొయ్య ! దురాత్ములార ! ఛీ !
కప్పము, పన్నులంచు మము కట్టుమనం గెటు సిగ్గు లేదొకో !

నేలయు మాదే ! పీల్చెడు
గాలియు మాదే ! శరీర కష్ట ఫలితమౌ
కూలియు మాదే ! ఇంకన
దేలా పన్నులును, కప్ప మీవలె మీకున్ ?

పోరా ! ఈ భరతావనిన్ విడిచి పొమ్మం ” చు గర్జించుచున్
పోరాటంబును వీర సింహమయి పెంపుం జేసె ” నల్లూరి ” ; తా
” మే రీతిన్ పడగొట్టుటా యతని ” నం చింగ్లీషువారల్ మహా
ఘోరాలోచనలందు మున్గి రకటా ! క్రూరాత్ములై, ఉగ్రులై !

అంత నొకనాడు …

ఉదయ సంధ్య వేళ ఉద్యమకారుండు
ఇతరు లెరుగనట్టి యేటి లోన
వక్షమందు గల్గు వస్త్రాదులన్ విప్పి
స్నానమాచరింప సాగిపోయె _

కంట బడని ఆ యేటిని
ఒంటరిగా నతడు స్నాన మొనరింపంగన్ _
తుంటరి యొక డెరిగింపగ
కంటకులై చుట్టుముట్టి కాల్చి తుపాకుల్ _

చిట్టడవిని మసక చీకటిన్ తీసిరి
తెల్ల దొరలు దొంగ దెబ్బ నటుల _
తూట్లు పడెను మేను తూటాలు దూరగా _
రాజు దేహమయ్యె రక్త మయము !

”నలుగురు గూడి ఒక్కనిని, నన్ను నిరాయుధు జేసి, ఒంటిగా
జలముల నున్న వేళ నిటు చంపిన చంపితిరేమొ గాని ! ఈ
వెలువడు రక్త బిందువులు విప్లవ మూర్తుల రూపు దాల్చి, మీ
తలలను ద్రుంచి, మా భరత ధారుణి స్వేచ్ఛను బ్రోవకుండునే !“

అని శపించి కఠిను లాంగ్ల జాతీయులన్;
చిందు రుధిరమంటు చేతులెత్తి,
భారతాంబ కమిత భక్తితో కడసారి
ప్రణతులిడెను దేశ భక్త వరుడు _

”జన్మించితి నీ ఒడిలో _
జన్మము ధన్యంబు నిట్లు జన్మించుటయే !
మున్ముందు నిటులె తల్లీ !
జన్మింపగ నెంతును ప్రతి జన్మము” ననుచున్ _

భరత మాత కంట బాష్పాలు రాలగా
కనులు తేలవేసి మునిగె నీట _
ఏటిలోన తేలె ఎర్ర తామర పువ్వు !
విప్లవమున కతడు విత్తనమ్ము ! #

“డ్రంకండ్ డ్రైవ్ …”

“డ్రంకండ్ డ్రైవ్ …”

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

~~

త్రాగుడు పాడుగాను! సుర ద్రావియు పీకల దాక, నంతతో
నాగక, వాహనంబులను నడ్డము దిడ్డముగాను వీధులన్
వేగము బెంచి నడ్పుచును వీర విహారము జేసి గ్రుద్దగా,
సాగు నమాయిక ప్రజలు చచ్చుచునుండి రిదేమి కర్మమో!

ఎవడో చేసిన తప్పుకు
నెవరో యిటు బలియగు టిది యే న్యాయంబౌ?
చివరికి యా శిక్ష పడున
దెవరికి? మృతుని పరివార మేమై పోవున్?

ఏదొ “చలాను” గట్టి, మరి యేదొ యొకింతయు జైలు కేగి, యా
మీదట “కాలరె”త్తుకొని, మెల్లగ నింటికి చేరుచుందు రే
బాదర బందియున్ మరియు బాధలు లేకయె త్రాగుబోతులున్!
చేదును మ్రింగు నా మృతుని చిందర వందరయౌ కుటుంబమే!

పడుచు వయసునందె పతిని గోల్పోయిన
పడతి దీన గాథ బడయ వశమె?
చిన్న చిన్న వయసు చిన్నారులు, ముసలి
కన్న వారి బాధ గాంచ తరమె?

పచ్చని కాపురం బిటు విపత్తుకు లోనయి జీవితంబులో
చిచ్చును రేపుటేమి? విధి చేసిన ఘోరమొ? లేక యిద్ది యా
రొచ్చున దేలి, త్రావి చను క్రూరులు సేయు దురాగతంబొ? ఏ
మిచ్చిన తీరు నార్తి? పరమేశ్వర! చెప్పుమ నీవె న్యాయమున్!

“డ్రంకండ్ డ్రైవు”ను జేయుచు
సంకటములు కలుగ జేయు “చార్సౌబీస్” గా
ళ్ళిం కెక్కడ కనిపించిన –
కంకాళము విరుగునట్లు ఖండించుమయా! #

Previous Older Entries