“కవితాస్త్రాలయ”
11 డిసెం 2010 5 వ్యాఖ్యలు
” ఏ దేశమేగినా- ఎందు కాలిడినా-
ఆధునిక సాంకేతిక, సమాచార, ఆర్థిక ప్రగతి ఫలితంగా ప్రపంచమంతా ఒక పల్లెగా పరిణమించిన వేళ, ఎందరో భారతీయులు వివిధ దేశాలలో ఔద్యోగిక బాధ్యతలు నిర్వర్తిస్తూ స్థిర నివాసం ఏర్పర్చుకొని, అక్కడ మన సాహితీ, సాంస్కృతిక విజయ పతాకలను ఎగురవేయడం – స్వదేశంలో నివసిస్తున్న భారతీయులందరికీ గర్వ కారణం. అందునా మన ఆంధ్రులు ఇందులో మరీ ముందుండడం ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకానికి మరింత ఆనంద దాయకం. నాటి రాయప్రోలు వారి సందేశ స్ఫూర్తి ఈనాటి ప్రవాసాంధ్రులలో ప్రతిఫలించి పరిఢవిల్లడం ఎంతో ముదావహం.
హైదరాబాదు ( సం|| )
మరో భగత్ సింగ్ …
09 డిసెం 2010 5 వ్యాఖ్యలు
మరో భగత్ సింగ్ …
నియంతను నియంత్రించలేనప్పుడు
నిర్మూలనమే మార్గమని యెంచావు –
స్వాతంత్ర్యేచ్ఛతో తెలంగాణలో
మరో భగత్ సింగై అవతారమెత్తావు –
బాంబును విసిరి
భూమిని బ్రద్దలు చేసావు –
ప్రజా గర్జనను
నింగి దాకా ప్రతిధ్వనింపజేసావు –
గురి తప్పినా, గుండె లదరగొట్టావు –
నియంత మనస్థైర్యాన్ని నీరు గార్చావు –
పట్టుబడినా, నీవు పట్టు వీడలేదు –
తల తీస్తామన్నా, నీవు తల వంచలేదు –
నీ త్యాగ నిరతితో
స్వాతంత్ర్య యోధులకు స్ఫూర్తినందించావు –
నీ సాహసంతో
లక్షలాది యువకులకు లక్ష్యాన్ని నిర్దేశించావు –
తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలను
తెగగొట్టిన వీరుడవు నీవు !
ఈ గడ్డపై భారత పతాకను
నిలిపిన శూరుడవు నీవు !
కలలు గన్న స్వాతంత్ర్యాన్ని
కళ్ళారా చూసిన ధీరుడవు నీవు !
స్వాతంత్ర్యానికి ముందు, చావుకి సిద్ధపడి
ఉద్యమానికి ఊపిరులూదావు –
స్వాతంత్ర్యానంతరం, బ్రతుకును గెలిచి
స్వేచ్ఛా వాయువులను శ్వాసించావు –
పటాటోపాల లోకంలో
ముఠా మాయగాళ్ళ సమాజంలో
మామూలు మనిషిగా జీవించావు –
నిరాడంబరునిగా ఓ మూల నివసించావు –
మా ‘ నారాయణరావు పవార్ ‘ !
ఓ ‘ తెలంగాణ భగత్ సింగ్ ‘ !
మరో స్వపరిపాలనోద్యమ వేళ –
మరో సూర్యోదయ వేళ –
అస్తమించావా ?
అమరత్వం పొందావా ?
సమైక్య రాష్ట్రంలో
పాఠ్యాంశాల్లో నీ ప్రస్తావన లేక పోవచ్చు –
కుహనా స్వాతంత్ర్య యోధుల నడుమ
నీకు గుర్తింపు లభించి ఉండక పోవచ్చు –
మా గుండెల్లో మాత్రం నీ వెప్పుడూ
అమరుడవే !
సాటి లేని మేటి
విప్లవ వీరుడవే !
దేశ భక్తుడవే !
( ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు – ‘ తెలంగాణ భగత్ సింగ్‘
శ్రీ నారాయణరావు పవార్ మృతికి నివాళిగా … )
– డా. ఆచార్య ఫణీంద్ర
వరాహ శతక సమీక్ష
08 డిసెం 2010 4 వ్యాఖ్యలు
కవి కావ్య నిర్మాణ దృక్పథాన్ని క్షుణ్ణంగా అవగతం చేసుకొని, కృతి సమీక్ష చేసేవారు సమర్థ విమర్శకులుగా పరిగణింపబడతారు. అలాంటి సద్విమర్శకులు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్ గారు. ఆయన నా ” వరాహ శతకము ” పై చేసిన సమీక్ష నన్ను అబ్బురపరచింది. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకొంటూ, ఆయన బ్లాగులో ప్రచురించిన ఆ సమీక్షను ఇక్కడ పునః ప్రచురిస్తున్నాను.
– డా. ఆచార్య ఫణీంద్ర
వరాహశతకము – పుస్తక సమీక్ష
– కోడీహళ్ళి మురళీమోహన్
[పుస్తకం పేరు: వరాహశతకము, రచన: డా. ఆచార్య ఫణీంద్ర, వెల: రూ.80/-, ప్రతులకు:శ్రీమతి జి.సావిత్రి, పూర్ణేందు ప్రచురణలు,102,శ్రీనివాస ఆర్కేడ్, ఈస్ట్ మారుతీనగర్,మౌలాలి, హైదరాబద్ 500040 మరియు ఆంధ్రసారస్వత పరిషత్, ఎ.వి.కె.ఫౌండేషన్,నవోదయ, ప్రజాశక్తి, విశాలాంధ్ర]
ఈ అధిక్షేప, హాస్య, వ్యంగ్య శతకం వరాహమా అంటూ వరాహాన్ని సంభోదిస్తూ చెప్పబడిన పద్యకవిత. వరాహమనేది ఒక కేవలం మిషగా తీసికొని ఈ శతకంలో మనుష్యజాతి విపరీత పోకడలను కవి ఎండగడుతున్నారు. పంది మీద శతకమేమిటని పండితులు ఘాటుగా తిట్టినా తిట్టనీ తాను వెనుదిరగనని కవి ఈ శతక రచనకు పూనుకున్నారు.
కవి వరాహానికి ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తున్నారు ఈ పుస్తకంలో. కనకాక్షుడనే రాక్షసుణ్ని సంహరించటానికి విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తినట్లు, హరి ఆదివరాహముగా కీర్తింపబడుతున్నట్లు, తిరుమల కొండ పై వరాహ తీర్థం ఏర్పడటానికి కారణమైనట్లు, నేటికినీ తిరుమలలో ముందు వరాహమూర్తి దర్శనమైన తరువాతనే వెంకటేశ్వరుని దర్శిస్తారని, సింహగిరిక్షేత్రంలోని దేవుణ్ని వరాహ నరసింహుడని పిలుస్తారని, కల్పములలో ఒకదానిని శ్వేతవరాహ కల్పమని పిలుస్తారని, అర్జునుడు పాశుపతాస్త్రము కోరి తపస్సు చేయగా శివుడు పరిక్షంప దలచిన సందర్భములో వారిరువురి బాణపు దెబ్బలను నిస్స్వార్థముగా సహించినట్లు, గణితశాస్త్ర కోవిదుడు వరాహమిహిరుని పేరులో కూడా వరాహము పేరు ఉన్నట్లు, కాకతీయ ప్రభువు రాజ్య పతాకముపై చిహ్నంగా ఉన్నట్లు కవి తెలుపుతున్నారు.
ఇంతటి పూర్వ చరిత్ర ఉన్న పందిని లోకులు ఎందుకు ఈసడిస్తారో కదా? అని కవిగారు వాపోతున్నారు. ప్రాణులన్నీ ఒకటేనని, అందరి శరీరాలలో పారే రక్తం ఒకటేనని,అందరికి అన్ని సమానంగా దక్కవలనని శాక్యముని మొదలుగా గాంధీ, అంబేద్కరు, జ్యోతీబాఫూలే మొదలైన వారు చాటినా ప్రజలు రంగులు వేరనీ, ప్రాంతాలు వేరనీ, పేద ధనిక వర్గాలనీ,జాతి, లింగ కుల వివక్షతను పట్టుకుని మూర్ఖముగా వేలాడుతున్నారని కవి ఆక్రోశిస్తున్నారు. పందులలో కూడా సీమ పందులు, ఊరపందులు, అడివి పందులు, ముళ్ల పందులు, తెల్లవి, నల్లవి ఎన్నో రకాలున్నప్పటికీ మానవుల వలె భేదభావములు లేవని కవి ప్రశంసిస్తున్నారు.
“కొందరు మనుష్యులు ముప్పూటలా మెక్కి ఏ పనీ చేయకుండా ఉంటారు. అట్టివారిని ‘పంది వలె బలుపు పట్టి ఉన్నా’వని తూలనాడితే నీ మనస్సుకు ఎంత బాధ కలుగుతుందో కదా? “అని కవి జాలిపడుతున్నారు. “నీపై ఎండా వానలు పడినా నీలో చలనం ఉండదు. మా నేతలకు కూడా ఈ గుణం అబ్బింది. ఎంత తిన్నా నీవు ఏది పడితే అది మెక్కుతావు. మా నేతలు కూడా పశుగ్రాసం, టెలివిజన్లు, పాలడబ్బాలు,బ్యాంకులు, చిట్ఫండ్లు, షేర్ మార్కెట్ స్క్రిప్పులు అవి ఇవి అని లేక ఏదిపడితే అది అచ్చంగా నీ వలే మేస్తారు. ఎవడు మంచి వాడో? ఎవడు నీ అవతారమో? అని మేము ముందుగా కనిపెట్టలేకపోతున్నాము.” అని కవి వ్యంగ్యంగా చెబుతున్నారు.
“దారిలో ఎక్కడ ఏ మురికి కనిపించినా శుభ్రంగా తినేస్తావు. నీ కృషి మా మున్సిపాలిటీ వారికి మార్గదర్శకం కావాలి” అని చమత్కారంగా అంటారు. “వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ‘ఒక స్త్రీకి పంది పిల్లలు పుడతా’రని ఎప్పుడో చెప్పారు. రూపం సంక్రమిస్తే వింతే గాని నడతను చూస్తే నీవలె ఏనాడో పుట్టారు” అని హాస్యభరితంగా అంటున్నారు. “గంపెడు పిల్లలను కను నీమాదిరి మానవులు కూడా పెక్కురు పిల్లలను కంటున్నారు. అది చూసి నిన్ను మదిలో తలచుకుని నీరసం కలుగుతున్నది. మానవజాతి కుటుంబ నియంత్రణ పాటించి నిన్ను ఆదర్శముగా తీసుకొనకూడద “ని కవి ఆశిస్తున్నారు.
“పల్లెల్లో ఇప్పటికీ పందులు వీరవిహారం చేస్తూ ఉంటాయి. పందులు లేనియెడల పల్లెలు వృద్ధి చెందినట్లే అనే భావం నీకు వేదన కలిగించవచ్చు. మెదడువాపు, స్వైన్ఫ్లూ మొదలైన వ్యాధులు వ్యాపింపచేయడం నీకు భావ్యమా?” అని ప్రశ్నిస్తున్నారు. “గిరిజనులు కొందరు సంప్రదాయము పేరున భుజించిన భుజించ వచ్చు కాని ఎన్నో రకాల శాకములన్నప్పటికీ నాగరికులు నిన్ను ‘పోర్క్’ అనే పేరుతో భుజించటం భావ్యమేనా? కొందరికైనా నీవు ఆకలి తీర్చేంచుకు ఆత్మ త్యాగం చేస్తున్నావు. పందుల పెంపకం లాభసాటి వ్యాపారంగా గుర్తించి కొందరు వర్తకులు దానిని చేపడుతున్నారు. తొలినాళ్లతో దూరదర్శన్లో ఎప్పుడూ పందుల పెంపకంపై కార్యక్రమాలను చూపేవారు. ఏమైనా కాని ఇట్లా పందులను సంతలో అమ్ముట విచారకరం” అని కవి జాలి చూపిస్తున్నారు.
ఈ శతకంలో ఆచార్య ఫణీంద్రగారు తాము చెప్పదలచిన భావాలను సుస్పష్టంగా చెబుతున్నారు. “అభ్యుదయమ్ము నా పథము! అట్టడుగందున నున్నవారి కే నభ్యుదయమ్ము గోరెదను”అంటున్నారు. దుబాయి షేకులకు హైదరాబాదు పాతనగరంలోని మహమ్మదీయులు తమ పసి పిల్లలను కాసుల మూటకై నిఖా జరిపించిన యథార్థ దుర్ఘటనలు కవిగారి హృదయాన్ని ద్రవింపజేస్తోంది. “లౌకిక సౌఖ్య సంపదల లౌల్యము పెంచునవాంగ్ల విద్యలు” అని నిరసిస్తున్నారు. “అరువది నాల్గు సత్కళలు, నంతకు మించిన మేటి క్రీడలుం”డగా “ఎరువుగ దెచ్చుకొన్న క్రికెటెంతురు మా యువకుల్!” అని వాపోతున్నారు. “రోమనులట్లు ప్రేమికుల రోజును క్రొత్తగా నేర్వనేటికో?” అని ప్రశ్నిస్తున్నారు. “తరగని ప్రేమ పెన్నిధుల తత్త్వము, సత్త్వమెరుంగకున్నచో ఒరుగునదేమి ప్రేమికుల కొక్క దినంబిడ” అని సూత్రీకరిస్తున్నారు. ఇంకా ఈ పద్యకృతిలో సినిమాలలో చూపుతున్న అసభ్యతను, డబ్బుకోసం ప్రజలు పడే కక్కుర్తిని, భార్యను చులకనగా చూసే భర్తలను, యువతులపై ప్రేమ పేరుతో జరుగుతున్న యాసిడ్ దాడులను, ఉగ్రవాదులను తయారు చేస్తున్న మదర్సాలను కవిగారు తూర్పారబట్టారు.
వరాహానికి గల పర్యాయపదాలనన్నింటినీ ఒకే పద్యంలో చక్కగా ఇమిడ్చి డా.ఆచార్య ఫణీంద్ర ‘పద్యకళా ప్రవీణ’ అని నిరూపించుకున్నారు. పందికి సంబంధించిన అన్ని విషయాలనూ సేకరించి ఈ కృతిలో చొప్పించి ఈ శతకాన్ని ‘సూకర సర్వస్వం’గా మార్చినారు. ఇది వీరి విషయగ్రాహ్యానికి దర్పణం పడుతోంది. సిద్ధాంతమనే గ్రామంలో ఒక పంది గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వింత వార్తను కూడా ఈ శతకంలో ప్రస్తావించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.
ఈ కృతికి డా.కె.వి.రమణ, ఆచార్య మసన చెన్నప్ప, ఆంధ్రపద్యకవితా సదస్సు శాశ్వతాధ్యక్షులు శ్రీ శిష్ట్లా వెంకటరావుగారి పీఠికలు శోభను గొలుపుతున్నాయి. ఈ కావ్యాన్ని ఇద్దరు మహాకవులు గుఱ్ఱం జాషువా, దాశరథి కృష్ణమాచార్యలకు అంకితమియ్యటం కవి అభిరుచిని చాటుతోంది.
ఈ గ్రంథావిష్కరణ సందర్భంగా పరిచయకర్త శ్రీ జి.ఎం.రామశర్మ చెప్పినట్లుగా ఈ దశాబ్దంలో పద్యకవితకు లభించనున్న ఆదరణకు సూచిక ఈ వరాహశతకం. ఈ శతకాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమీప భవిష్యత్తులో బల్లిశతకం, మశక శతకం వంటివి వెలువడవచ్చని ఎవరైనా ఆశిస్తే అది ఏమాత్రం అత్యాశ కాబోదు.
— *** —
అందరికీ తెలియవలసిన ఆంధ్రుల చరిత్ర
07 డిసెం 2010 2 వ్యాఖ్యలు
ఉద్యమాల నేపథ్యంలో… ప్రతి తెలుగువాడు తెలుసుకోవలసిన ఆధునికాంధ్ర చరిత్ర ఇది. ఈ రోజు “ఈనాడు” దిన పత్రిక – సిటీ సప్లిమెంట్ లో ‘ప్రతిభ‘ శీర్షిక క్రింద ప్రచురించబడిన ఈ క్లుప్త వ్యాసం … ఈనాటి పరిస్థితులకు కారణమై నిలిచిన తప్పిదాల పట్ల, అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకొనేందుకు ఉపకరిస్తుంది.
“ఈనాడు” దిన పత్రికకు కృతజ్జతలతో –
– డా. ఆచార్య ఫణీంద్ర
నిండు సభలో ఆత్మీయంగా సాగిన గ్రంథావిష్కరణ
05 డిసెం 2010 6 వ్యాఖ్యలు
నిన్న(౩ డిసెంబర్) జరిగిన నా ‘వరాహ శతకము’ ఆవిష్కరణ సభ సాహిత్యాభిమానులు, ఆత్మీయులతో నిండుగా అలరి, వేదిక పైనున్న అతిథులకు, నాకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించింది. ముఖ్యంగా, బ్లాగు మిత్రుడు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్ గారు నా మీద అభిమానంతో విచ్చేసి ప్రోత్సహించడం మరింత ఆనందాన్ని కలిగించింది. సభాధ్యక్షులు, ప్రముఖ కవి డా. జె. బాపురెడ్డి గారు; ముఖ్య అతిథి ప్రముఖ సాహితీవేత్త, రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డా. కే. వి. రమణ గారు; సుప్రసిద్ధ విమర్శకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ ‘డీన్ ఆఫ్ ఆర్ట్స్’ అయిన నా పి.హెచ్.డి. గురువు గారు ఆచార్య యస్వీ. రామారావు గారు, ప్రముఖ కవి డా. దేవరాజు మహారాజు గారు; ఉస్మానియా తెలుగు శాఖాచార్యులు ఆచార్య మసన చెన్నప్ప గారు, మొదలైన వారంతా మనసు విప్పి మాట్లాడారు.
ప్రసంగాలలో వీరంతా నా పట్ల వర్షించిన ప్రేమ, వాత్సల్యానికి నా హృదయం ఎంతో పారవశ్యంలో తేలియాడింది. ‘వరాహ శతకము’ అనగానే ఇదేదో భక్తి శతకమనుకొన్న సభాసదులు అందులోని అభ్యుదయ భావాలు, అధిక్షేప హాస్య వ్యంగ్యాలను గురించి తెలుసుకొన్నాక, నన్ను మనసారా అభినందించడంతో నా ప్రయత్నం సార్థకమయిందని సంతోషించాను. ఈ రోజు ‘ఈనాడు’, ‘సాక్షి’, ‘ఆంధ్ర జ్యోతి’, ‘ఆంధ్ర భూమి’, ‘ఆంధ్ర ప్రభ’ వార్తా పత్రికలలో ఫోటోలతో కూడిన కథనాలు ప్రచురించబడి, చాలా సంతృప్తిని కలిగించాయి.
సాక్షి :
ఆంధ్ర జ్యోతి :
ఈనాడు :
ఆంధ్ర ప్రభ :
– డా. ఆచార్య ఫణీంద్ర
ఆహ్వానము
02 డిసెం 2010 వ్యాఖ్యానించండి
ఎన్నో రోజులుగా వాయిదాపడుతున్న నా “వరాహ శతకము” గ్రంథావిష్కరణ సభ ఎట్టకేలకు డిసెంబర్ 3 వ తేదీన సాయంత్రం 6 గం||లకు సుల్తాన్ బజార్, హైదరాబాద్ లోని “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం” లో నిర్వహించబడుతోంది. జంట నగరాలలోని బ్లాగు మిత్రులందరూ ఈ సభకు విచ్చేసి, నన్ను ఆశీర్వదించగలరని ప్రార్థన.
– డా. ఆచార్య ఫణీంద్ర
ఆహ్వాన పత్రిక: