ఏక వాక్య కవితలు (ఇంకొన్ని) …

ఏక వాక్య కవితలు (ఇంకొన్ని) …

[లోగడ నేను ప్రచురించిన టపాలలో కవిత్వాంశకు సంబంధించి – చాలా మందికి నచ్చిన, బాగా చర్చనీయాంశమైన, బహుళ ప్రచారం పొందిన టపాలు రెండున్నాయి.  అవి – మార్చ్ 2009 లో, జూలై 2009 లో ప్రచురించబడిన నా ’ఏక వాక్య కవితలు’. అవి ఎంతగా ప్రసిద్ధి చెందాయంటే – అవి ప్రచురించబడి దాదాపు మూడేళ్ళవుతున్నా, ఇప్పటికీ వారానికి ఇరవై నుండి ముప్పయ్ మంది సాహిత్యాభిమానులు వాటిని వీక్షిస్తూనే ఉన్నారు. అవి సాహిత్యాభిమానుల హృదయాలకు ఎంతగా హత్తుకోన్నాయంటే – ఇప్పటికీ అడపా దడపా మంచి మంచి వ్యాఖ్యలను చేస్తూనే ఉన్నారు.

 Bhaskara Rami Reddy

మార్చి 17, 2009 @ 03:00:20

ఫణీంద్ర గారు,
ఒక్కోక్క వాక్యం ఒక్కోక్క సంహిత.ఎంతబాగా మాల కట్టారండి.

patanjali
మార్చి 28, 2009 @ 07:14:08

నమస్సులు.
మీ బ్లాగ్ బాగుంది.
ఏక వాక్య సంయోజనలో కవితావిష్కరణ ప్రయోగం అభినందనీయం.
-డా.తాడేపల్లి పతంజలి

lakshmiprabha
మార్చి 31, 2009 @ 22:16:43

namasthe  
vakyam   rasatmakam  – the  coinage is justified in your beautifully short expressions.

Vinay
జూన్ 14, 2009 @ 22:49:04

Telugu theyyadanam parimalalalo olaladinchina meeku ede na namassumanjali.

potukuchi taraka phanindra sarma
Feb 12, 2011 @ 01:37:29

meeru vrasina kavitha నీ kosam jeevithakalam nireekshinche preyasi mrutyuvu annaru , a okkapadam tho nenu jeevitamlo marachipolekapotunna nannu prminchina { mosaginchina } naa preyasini marachipoyi jeevitamlo hayiga untunnanu , meeku dhanyvaadalu . 

SUDHEER KUMAR
డిసెం 23, 2011 @ 21:35:15

velakakattakattleni vakyala harivillukada idhi

Kaleswara Rao
జన 26, 2012 @ 18:39:31

Sri Phaneedra Garu

kasta manasu bagoleka telugu kavitalu clicks chesa, me kavitalu chusakame Eka vakya kavitalu – manasuki manchi kick la panichesayi
Thanks
కలి

—————————————————————–

ఇలాంటి వ్యాఖ్యలు కవిగా నాకు మంచి సంతృప్తిని కలిగిస్తాయి. అలాంటి సాహిత్యాభిమానుల కోసం నా ఏక వాక్య కవితలు ఇంకొన్నింటిని ప్రచురిస్తున్నాను.  మనసారా ఆస్వాదించి, ఆశీర్వదించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర ]

*కరిగి కురిసే మేఘమైనా , గర్జిస్తే దిక్కులు కంపిస్తాయి.

*కుందింది మనసైతే, బుగ్గా! నువ్వెందుకే కందడం?

*చిరుత ప్రాయం – గాండ్రింపులు మామూలే!

*జీవితం కాలిపోతున్నా జీవితాల్ని వెలిగించు.

*కష్టాల్లో ఆత్మీయుల పలకరింపులు – వేడి వేసవిలో గొంతులో జారే చన్నీటి చుక్కలు.

*ప్రాణం అంటే తీపి – చస్తే చావను!

*వేల మైళ్ళ ప్రయాణమైనా వేసేది ముందు ఒక అడుగే!

*ఒక బుల్లి పెట్టె వల్ల ఇల్లిల్లూ కల్లోలమే!

*గుండెలు ద్రవించాయి – కళ్ళు వర్షించాయి 

*వందలాది ‘లబ్ డబ్’  లకు ‘ఛుక్ ఛుక్’ అంటూ శ్రుతి కలుపుతోంది రైలు! 

 *నింగి పొయ్యిలో నిప్పు రాజేసి భూగోళాన్ని ‘ఫ్రై’ చేస్తున్నాడు సూర్యుడు.

* కాకికేం తెలుసు విగ్రహం వీర శివాజీదని – రెట్ట వేసింది.

*పురిటి నొప్పులు పడుతున్న పూర్ణ గర్భిణిలా నడుస్తోంది బస్సు.

*ప్రొద్దున్నే సూర్యుడేమిటి – చెట్టు చాటు నుండి దొంగ చూపులు?

*అమాయికత్వం కాకపొతే, అశాశ్వత జీవితాలు వెళ్ళబుచ్చడానికి శాశ్వత భవనాలు కట్టుకోవడమేమిటి?

*కాలం కత్తికి రెండు పార్శ్వాలు – గతం, భవిష్యత్తు!

*నిరక్షరాస్యత – పాల బుగ్గపై కన్నీటి చార!

*ప్రపంచాన్ని రెక్కలకు కట్టుకొని గుమ్మంలో వాలే పక్షి – వార్తా పత్రిక!

*భ్రమలో తేలే మనసుకు వాస్తవాలు ములుకుల్లా గుచ్చుతాయి.

*నీ మునివాకిట్లో వేచి వేచి, నీ పిలుపందేసరికి నివురైపోయాను.

* యంత్రం మానవుని మంత్రం -మానవుడు దేవుని యంత్రం!

*కొందరికి తిండి దొరకక హాహాకారాలు – కొందరికి తిన్నదరగక వ్యాయామాలు!

*ఇంధనం లేక వాహనం, నం లేక జీవనం – ముందుకు సాగవు!

*చెట్టులా పెరిగి ఏం లాభం? – బుద్ధి చిగురించనప్పుడు!

*బరువంతా గుండెల్లో దాచుకొన్న సంచిని చేతి వేళ్ళకు ఉరేస్తాడు మనిషి.

*మట్టిలోకి తోసేసిన మనిషికే చెట్టై సేవ చేస్తుంది విత్తనం.

*కంటి తడి తెలియని వాడు కవి కాలేడు. 

*జీవన వాక్యంలో అనారోగ్యం కామా; మృత్యువు ఫుల్ స్టాప్!

*ఆమెకు, నాకు మధ్య చూపుల తోరణాలు.

*బాల్య చాపల్యం కాకపోతే, భగవంతుడు విశ్వాన్ని బొంగరంలా తిప్పి ఆడుకోవడమేమిటి?

*కరిగిపోయేది కాలం కాదు – నీ ఆయువు! 

*నువ్వు తడవకుండా ఉండేందుకు తాను తడిసిపోయే త్యాగి – గొడుగు!

*గుండెదిటువు గలవానికి జీవించడం – ఇరానీ కేఫ్ లో టీ త్రాగినంత సులువు!    

*తలబిరుసుతనంతో తరలి వెళుతుంటే, గుడిలో గీతా శ్లోకం కొరడా చరుపై వినిపించింది.    

*నిద్రిస్తున్న నగరంలో నడుస్తున్న దివిటీ -గూర్ఖా!

*కన్నీటి కెరటాలలో స్వప్న శకలాలు తేలియాడుతున్నాయి!             

*ఎండా వానల స్నేహం ఏడు రంగులతో మెరిసింది!

*తమస్సులో ప్రయాణిస్తున్నాను – ఉషస్సుకై అన్వేషిస్తూ!  

*బ్రతుకవచ్చిన కప్ప బావినే మింగితే ఎలా?

* దివి నుండి భువికి దిగివచ్చే దేవత వర్షధార!

*కొండ గుండె పగిలిందేమో – కన్నీరు జలపాతం!

*ఆ వృద్ధ దంపతుల దేహాలు ఇండియాలో – ఆత్మలు అమెరికాలో!

*భావానికి స్నానం చేయించి, పెళ్ళికూతురిలా అలంకరించడమే కవిత్వం!

—***—

పాడవే చెలి!

పాడవే చెలి! [గీతం]

రచన: డా. ఆచార్య ఫణీంద్ర

[2003లో అనుకొంటాను – ’సిలికానాంధ్ర’ (యు.ఎస్.ఏ.) వారు అంతర్జాతీయ స్థాయిలో ’తెలుగు గేయ కవితల పోటీ’ నిర్వహించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ’న్యాయ నిర్ణేత’గా వ్యవహరించిన ఆ పోటీలో నా ఈ లలిత గీతం పురస్కారాన్ని పొందింది. నేను రచించిన వాటిలో, నాకు బాగా నచ్చిన గీతాలలో ఇది ఒకటి. ఆస్వాదించండి.]

పాడవే చెలి! తీయ తీయగ –
పరవశము నందీయగ!
పరవశము నందీయగ!!

వివిధ భాషల వెలయ జేసిన
మధుర కవితల మధువులన్నీ –
ఒక్కచో కలబోసి గ్రోలుచు
మక్కువను మది తీర్చుకొనునటు –
పాడవే చెలి! …

తీపి గొంతుక తీగ సాగుచు
హృదయ సీమల నెల్ల తాకుచు –
తాకు తాకున తన్మయత్వపు
పూల పుప్పొడి రాల జేయగ –
పాడవే చెలి! …

వేడి వేసవి వీధి సాగుచు
నీడ పట్టున నిలిచినంత –
మలయ పవనం మేను తాకిన
మధురమౌ అనుభూతి కలుగగ –
పాడవే చెలి! …

-***—

ఉపవాస దీక్ష

ఉపవాస దీక్ష

స్వాతంత్ర్య భారతికి ‘షష్టి పూర్తి‘ సంబరాలు జరుగుతున్నాయి
“ స్వరాజ్య ఫలాలతో చేసిన సురుచిరమైన కేక్ ను కట్ చేసి,
అందరికీ సమానంగా పంచుతాం “ అన్నారు అధినాయకులు
“ ఎప్పటిలాగానే సగభాగం మాది “ అన్నారు వెనుకబడిన వర్గాల వారు
“ సరే! సగభాగంతోనే సరిపెట్టుకొందాం! “ అనుకొన్నారు అగ్ర వర్ణాల వారు
“ మా భాగం వేరు చేసి ఇవ్వా “ లందొక మహిళ
“ మా సంగతేంటి? “ అన్నాడొక మైనారిటీ
” మతం మారినా, మా భాగం మాకే ఉండాలి “ అన్నాడు దళితుల్లో ఒకడు
“ మాలలు మాదిగలకు కలిపి ఒకే పెద్ద ముక్క ఇవ్వా “ లన్నాడొక మాల
“ అదేం కుదరదు – నాలుగు ముక్కలు చేసి, ఎవరి ముక్క వారికివ్వాలి “ అన్నాడొక మాదిగ
“ దళితులే వెనుకబడిన వారా? ఇతర వెనుకబడిన వర్గాలు లేవా? ” –
అన్నారు కులాల చిట్టా విప్పి కొందరు
“ కేక్ క్రీమును చప్పరించడానికి ‘క్రీమీ లేయర్ల‘ గొడవేంటి? ఎత్తేయాలి “ అన్నా రింకొందరు
“ తరువాత మిగిలేదెంతో – తగిలేదెంతో – మాకూ ఈ పంపకాల్లోనే వాటా ఇవ్వాలి ” –
అన్నారు కొత్త కులాల వారు

ఇలా … ” మేం వెనుకబడ్డ వాళ్ళం ” అంటే, ” మేం వెనుకబడ్డ వాళ్ళం ” అంటూ –
గుండీలు తెంపుకొని, చొక్కాలు చింపుకొని గుండెలు బాదుకొన్నారు అందరు!

ఇంతలో … సందట్లో సడేమియా అన్నట్టు – డబ్బులు గుప్పి, పైరవీలు నడపి,
దొంగ చాటుగా దొరికినంత మింగేస్తున్నారు బడా చోరులు!

” మనకే సరిపోదు – జనాల కేం పంచుతాం? ” అని గొణుక్కొన్నారు రాజకీయ నాయకులు
కత్తులతో కట్ చేసుకొండంటూ జనాలకు కత్తుల నందించారా వినాయకులు

కత్తులు దూసి, ” అడ్డొచ్చిన వారిని అడ్డంగా నరికేస్తాం ” అన్నారా జనాలు

అందరూ ఒక్కసారి మొత్తం కేక్ పైబడి మాకంటే మాకంటూ పీక్కొంటున్నారు
మూతి కందిన వాడు పీకల దాకా మెక్కాడు
చేతి కందని వాడు నేల పాలు చేసాడు
ఆ కాట్లాటలో అందరి ముఖాలపై పడ్డాయి –
కేకు తాలూకు కక్కుర్తి మచ్చలు!

చేతగాని పేద చవట బ్రాహ్మడు మాత్రం, చవులూరినా –
” కేక్ అప్రాచ్యం! ’’ అనుకొని ముక్కు మూసుకొని
ఒక మూల ఉపవాస దీక్షకు పూనుకొన్నాడు!

( సమకాలీన దేశ పరిస్థితులను సరదాగా చిత్రించే ప్రయత్నం –
” నా వాటా నాకు కావాలి ” అని ప్రతి ఒక్కడూ పోరాడే పరిస్థితుల నుండి,
ఆ ప్రతి ఒక్కడికీ ” ఇది నీ వాటా – తీసుకో! ” అని మిగితా వారంతా ప్రేమగా అందించే
రోజులు రావాలని ఆకాంక్షిస్తూ – )

నా భారతీయ సోదర సోదరీమణులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో –

డా. ఆచార్య ఫణీంద్ర

— *** —

వెదికింది ఒకటి .. దొరికింది ఒకటి …

మొన్న ఆదివారం పాత పుస్తకాలు, పేపర్లను వెదుకుతుంటే –
ఎప్పుడో ఇరవయ్యేళ్ళ క్రితం నేను వ్రాసుకొన్న కొన్ని ‘బాల గేయాలు‘ కనిపించాయి.
నేను వెదికింది ఒకటి .. దొరికింది ఒకటి …
అయితేనేం? ఆ గేయాలను చూస్తే ఇప్పుడు ముచ్చటేసింది – బహుశః ఇంగ్లిష్ లో పిల్లలకు నేర్పుతున్న అర్థం పర్థం లేని వ్యర్థపు ‘రైము‘ల్లా కాకుండా – తెలుగులో చిన్న పిల్లలు సరదాగా పాడుకొనేలా ఉండి, వాళ్ళకు కాస్త విజ్జానాన్ని కూడా పంచేలా ఉండాలన్న సదుద్దేశ్యంతో వ్రాసినట్టున్నాను. ఒక యాభై దాక గేయాలు వ్రాసి పుస్తకంలా వేయాలన్న తలంపు అప్పట్లో ఉండి ఉంటుంది. అందుకే ‘బాలోల్లాసం‘ అన్న ‘బుక్ టైటిల్‘ కూడా వ్రాసి పెట్టుకొన్నాను. ఒక పదిదాక వ్రాసాను. తరువాత ఆ విషయమే మరచిపోయా నెందుకో మరి!
సరే – ప్రస్తుతానికి ఉన్నవాటిలో కొన్నిటిని అంతర్జాలానికి ఎక్కిద్దామనిపించింది — ఆస్వాదించండి.

చినుకు

చినుకూ చినుకు –
ఎక్కడి చినుకు?
ఆకాశంలో
పుట్టిన చినుకు –
ఆపై నేలకు
దూకే చినుకు –
వాకిట్లోనే
పారే చినుకు –
వాగూ, వంక
కలిసే చినుకు –
పొలాలలోకి
చేరే చినుకు –
పుట్టించేను
మనకొక మెతుకు! *

విద్యుత్తు

వెలుగులు చిందే విద్యుత్తు!
’ఎడిసన్’ చూపిన విద్వత్తు!!
గాలిమర నుండి పుట్టిస్తే –
అది ’వాయు విద్యుత్తు’!
నేలబొగ్గుతో పుట్టిస్తే –
అది ’ఉష్ణ విద్యుత్తు’!
సూర్యుని నుండి పుట్టిస్తే –
అది ’సోలార్ విద్యుత్తు’!
నీటిలో నుండి పుట్టిస్తే –
అది ’జల విద్యుత్తు’!
’న్యూక్లియస్’ నుండి పుట్టిస్తే –
అది ’అణు విద్యుత్తు’!
పంచ భూతాల విద్యుత్తు!

ప్రపంచమంతా విద్యుత్తు!! *

గులాబి పూలు

అందమైన గులాబి పూలు
మొక్కపై ఉంటేనే మేలు!
ముట్టుకొంటే రెక్కలు రాలు!
పట్టుకొంటే గుచ్చును ముల్లు!

’ఢాంఢాంఢాం’

కాకర పువ్వులు కాలిస్తే –
మిలమిల మెరుపులు మెరిపిస్తే –
కన్నుల వెలుగులు ’ఛాంఛాంఛాం’
పిల్లల మనసులు ’ఝాంఝాంఝాం’

ఆటం బాంబులు పేలిస్తే –
భయంభయంగా చూస్తుంటే –
చెవిలో శబ్దాల్ ’ఢాంఢాంఢాం’
పిల్లల గుండెలు ’ఠాంఠాంఠాం’ *

పుష్ప గుచ్ఛం

ఎర్రని పూలు –
తెల్లని పూలు –
పచ్చని పూలు –
విచ్చిన పూలు –
రంగులొలుకు పూలు!
రమ్యమైన పూలు!!

మల్లె పూలు –
బంతి పూలు –
రోజా పూలు –
చామంతి పూలు –
అందమైన పూలు!
ఆకర్షించే పూలు!!

పూవులన్నీ స్వచ్ఛం –
ఒకటిగ కడితే గుచ్ఛం –
పూలలాంటిదే జనం!
గుచ్ఛం వంటిది దేశం!! *

చిటపట చినుకులు

చిటపట చినుకులు పడుతుంటే –
టపటప చప్పుడు చేస్తుంటే –
ఇటు అటు గెంతే పిల్లలు
ఇళ్ళల్లోనికి ఉరికారు
కిటికీ ముందు కూర్చున్నారు
కిటకిట తలుపులు విప్పార్చారు
జల్లులు మొగమున చిల్లుతు ఉంటే –
ఉల్లము ఝల్లన పులకించారు! “*

విద్యుచ్ఛక్తి

విద్యుచ్ఛక్తి – విద్యుచ్ఛక్తి –
వెలుగుల నిచ్చే విద్యుచ్ఛక్తి –
గాలిని విసిరే విద్యుచ్ఛక్తి –
నీళ్ళను తోడే విద్యుచ్ఛక్తి –
పాటలు పాడే విద్యుచ్ఛక్తి –
వంటలు వండే విద్యుచ్ఛక్తి –
బట్టలు ఉతికే విద్యుచ్ఛక్తి –
బొమ్మలు చూపే విద్యుచ్ఛక్తి –
చల్లనుబరచే విద్యుచ్ఛక్తి –
షాకులు కొట్టే విద్యుచ్ఛక్తి –
’ఫుల్లు’ వాడితే విద్యుచ్ఛక్తి –
చిల్లు జేబుకు విద్యుచ్ఛక్తి – *

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

—***—

ప్రపంచీకరణ భూతం

ప్రపంచీకరణ భూతం

రచన : ‘పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర

పచ్చని పంటభూములను పశ్చిమ దేశపు కంపెనీలకై
ఇచ్చి, బొటాబొటిన్ ధనము నేదొ ముఖంబున గొట్టి రైతుకున్ –
హెచ్చు ’కమీషనుల్’ గొనెద రిప్డు దళారి ప్రభుత్వ నాయకుల్!
బిచ్చమునెత్తె జాతికిని వెన్నెముకైనటువంటి రైతయో!!

”దున్నెడి వానిదే పొలము – దోపిడి నొప్ప” మటంచు జెప్పి, రై
తన్నల కోసమై నిలిచి దండిగ పోరిరి నాటి నాయకుల్!
కన్నుల గానగా స్థలము – ’కబ్జ’ యొనర్చుచు ’సెజ్జు’ పేర, రై
తన్నల వెన్నునే విరుచు త్రాష్టులు.. దుష్టులు.. నేటి నాయకుల్!!

నేటి ’హైటెక్కు’ కాలాన నిజము! చూడ –
’క్యాప్టలిస్టుల’ కే సర్వ కార్య సిద్ధి!
మధ్య, క్రింది తరగతుల మానవులకు
బ్రతుకు ’లోటెక్కు’ నై పూర్తి భ్రష్టమయ్యె!

కరవు తినగ ముద్ద – కల వెన్నొ ’సెల్ ఫోన్లు’!
కరవు త్రాగునీరు – కలదు ’కోకొ’!
డబ్బటన్న నిపుడు ’డాలరే’ అయిపోయె!
చేతి వృత్తులన్ని చితికిపోయె!

ఎక్కడొ విదేశముల మరి
ఎక్కువయిన ’పెట్రొలు’ వెల – ఇక్కడ నకటా!
ఎక్కువనై అన్ని ధరలు –
దిక్కును కనరాక కూలు దీనుల బ్రతుకుల్!

భూమిని నమ్మి రెక్కలను ముక్కలొనర్చెడి యన్నదాతలున్;
వేమరు కష్టముల్ సలిపి వృత్తి కళన్ వికసించువార లిం
కేమియు చేయలేక, బ్రతికింక ప్రయోజనమేమి లేదటన్ –
భామను, పిల్లలన్ విడచి ప్రాణములన్ బలిపెట్టి రక్కటా!

ఈ ’ప్రపంచీకరణ’ మందు నెదుగుచుంద్రు
మిద్దెపై ధనవంతులు మిద్దె గట్టి!
నిలువ దేశాన కాసింత నీడ లేక
రాలిపోవులే పేదల బ్రతుకు లింక!

          —***—

ఎగ్జిబిషన్ లో కవి సమ్మేళనం


హైదరాబాదులో నిర్వహించబడుతున్న 72వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో ప్రతి సంవత్సరంలాగే ఈ యేడు కూడ సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఏర్పాటు చేయబడిన కవి సమ్మేళనానికి ప్రముఖ కవి, సినీగీతరచయిత డా. వడ్డేపల్లి కృష్ణ అధ్యక్షత వహించారు.
కవులలో – డా. జె.బాపురెడ్డి, డా. ముదిగొండ శివప్రసాద్, డా. పోతుకూచి సాంబశివరావు, డా. తిరుమల శ్రీనివాసాచార్య, డా. కసిరెడ్డి వెంకటరెడ్డి, డా. అక్కిరాజు సుందరరామకృష్ణ, ఆచార్య మసన చెన్నప్ప, ఆచార్య ఎస్.వి. సత్యనారాయణ, డా. తిరునగరి, డా. రాధశ్రీ తదితరులతోబాటు నన్నూ ఆహ్వానించారు.
’సంక్రాంతి లక్ష్మి’ అన్న వస్తువుపై కవులందరూ వారి వారి శైలులలో కవితలు వినిపించి శ్రోతలను అలరించారు. నా పద్యాలు బాగున్నాయని శ్రీ టి.వి. నారాయణ, ఆచార్య మసన చెన్నప్ప, డా. తిరునగరి లతోబాటు పలువురు ప్రశంసించడం ఆనందం కలిగించింది. కవి సత్కారం, బరువైన కవర్లు అందుకొన్నాక అందరం కలిసి ఛలోక్తులు విసురుకొంటూ, నిర్వాహకులు ఎంతో ఆదరంగా వడ్డించిన విందుభోజనం ఆరగిస్తూ సరదాగా గడపడం మరింత ఆనందం కలిగించింది.

కవి సమ్మేళనంలో వినిపించిన నా కవిత >
———————————————–
ఆ.వె.
మకరరాశియందు మార్తాండుని ప్రవేశ
మై శుభప్రదమగునట్టి దినము
స్వాగతమ్ము నీకు – సంక్రాంతి లక్ష్మి! రా!
ఉర్వి జనుల కిద్ది పర్వదినము!

తే.గీ.
పడుచు లందాలు వాకిళ్ళ పరిమళించ –
పరికిణీ లాగి నడుముకున్ ప్రక్క జెక్కి,
మూతి బిగబట్టి, చేతిలో ముగ్గు పిండి
రాల్చి తీర్చెదరు విశాల రంగవల్లి!

కం.
పెద్దలు గని – తమ పిల్లలు
ముద్దుగ తోచెడి పతంగముల గొని నింగిన్
హద్దులు గానని ఎత్తున
ఒద్దికతో నెగురవేయ – నుబ్బుట కనమే!

చం.
పొలముల పంట యింటికిని పుష్కలమై చనుదెంచ – పూనియున్
తిలలను గ్రుప్పి పొంగలియు, తీయని నువ్వుల లడ్డు, లర్సెలున్,
అలర నిజాము ప్రాంతమున యద్భతమౌ రుచి చక్కినంబులన్ –
వెలదులు చేసి చూపెదరు వేవిధముల్ మన పాక వైభవాల్!

మధ్యాక్కర:
బూరనూదుచు గంగిరెద్దు బులిపించు బుడబుక్కలాట –
’హారి.. హారీ .. ’ యంచు చిరతలాడించు హరిదాసు పాట –
కోరి వాకిళ్ళ ముగ్గుపయి కూర్చిన గొబ్బిళ్ళు మరియు
చారు పుష్పాలు బంతులవి చాటురా సంక్రాంతి శోభ!
——————————————————

పనిలో పనిగా కొందరు కవులు ’నుమాయిషీ’ [ఎగ్జిబిషన్] పై కూడ కవితలు వినిపించారు. ఆచార్య ఎస్. వి. సత్యనారాయణ కవితలోని ఈ పంక్తులు అందరినీ ఆకట్టుకొన్నాయి.

”ఒకప్పుడు ఇంటికెవరైనా వస్తే ..
ఈమె మా అమ్మ, వీడు నా తమ్ముడు, ఇది నా చెల్లి – అని
పరిచయం చేసేవాళ్ళం –
ఇప్పుడు ఇంటికెవరైనా వస్తే …
ఇది మా ఎల్.సి.డి టి.వి., ఇది మా ఫ్రిజ్, ఇది మా మైక్రోవేవ్ ఓవెన్ – అంటూ
పరిచయాలు చేస్తున్నాం –
ఒకప్పుడు ఇంట్లో మమతలు కనిపించేవి –
ఇప్పుడు ఇంట్లో వస్తువులు కనిపిస్తున్నాయి!
ఒకప్పుడు ఇంటి నిండా మనుషులుంటే ..
వస్తువులను చూడడానికి నుమాయిషీకి వచ్చేవాళ్ళం!
ఇప్పుడు ఇంటి నిండా వస్తువులుంటే …
మనుషులను చూసేందుకు నుమాయిషీకి వస్తున్నాం!!”

నేను నా శైలిలో ఎగ్జిబిషన్ పై ఒక మినీకవిత వినిపించాను.

” నాన్న చేయి పట్టుకొని నేను
దర్శించాను ఆమెను –
నా చేయి పట్టుకొని మా అబ్బాయి
దర్శించాడు ఆమెను –
మా అబ్బాయి చేయి పట్టుకొని నా మనుమడు
దర్శించాడు ఆమెను –
నిత్య యవ్వని – నుమాయి’షీ’! ”

– డా. ఆచార్య ఫణీంద్ర

భారత చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ చిత్రం!

నేను చూసిన గొప్ప చిత్రాలలో ఇది ప్రత్యేకమైనది. ‘టైటానిక్‘ లాంటి చిత్రం సృష్టించడం ‘హాలివుడ్‘ కే సాధ్యం కావచ్చు. కాని “మేము మా స్థాయిలో అంతటి గొప్ప చిత్రం నిర్మించగలం-“ అని నిరూపించిన గొప్ప చిత్రం – ‘జర్నీ‘! ప్రమాదాలు .. ప్రణయాలు … అనుబంధాలు …. సమాజ సేవలు….. అన్నీ సమపాళ్ళలో కలగలిపి పండించిన రసవత్కావ్యం- ‘జర్నీ‘!!

అంతే కాదు – ఇది సామాజిక బాధ్యతను ఎత్తి చూపే చిత్రం. ముఖ్యంగా డ్రైవింగ్ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన చిత్రం. ట్రాఫిక్ పోలిస్ విభాగం పూనుకొని ప్రజలందరికీ ఈ చిత్రాన్ని ఉచితంగా చూపాలి. ఒక ACCIDENT ఎంతో మంది జీవితాలను ఎలా దౌర్భాగ్య స్థితికి నెట్టుతుందో కళ్ళకు కట్టే చిత్రం.

రెండు బస్సుల ఢీ ..అవసరానికి తగినంత గ్రాఫిక్స్… తెలివైన చలాకీ పిల్ల- ప్రియుడు మరణిస్తే బేలగా రోదించడం … డెత్ బెడ్ పైనున్న ప్రియురాలితో- నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే నాయకుడు …. తొలిచూపుల ప్రేమ తొలి గడియలలోనే- బ్రతుకు తెల్లవారిన విద్యార్థిని ….. 15 B …… 37 G …….. చివరలో GO SLOW అన్న SIGN BOARD సందేశం  …….. కంట తడి పెట్టని ప్రేక్షకులుంటారా?

మధుమతి పాత్రధారిణి నటన ..హృదయాలకు హత్తుకొనే స్క్రీన్ ప్లే … శరవణన్ దర్శకత్వ ప్రతిభ … చిత్రం చూసాక, ఆ క్షణం – ”మేము భారతీయులం” అని గర్వించిన వేళ్ళ మీద లెక్కపెట్టదగిన కొన్ని మధుర క్షణాలలో ఇదీ ఒకటి అనిపించింది. అవును – నిజం! ’జర్నీ’ – భారత చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ చిత్రం!

– డా. ఆచార్య ఫణీంద్ర

మూడు వత్సరాలు .. ముప్పది వేల వీక్షణలు …

గత అక్టోబర్, నవంబర్ మాసాలలో సిస్టం ముందు కూర్చునే అవకాశమే చిక్కలేదు. నిన్న వర్డ్ ప్రెస్ లో నా బ్లాగు ట్రాఫిక్ విశ్లేషణ చూసాక గుర్తుకొచ్చింది – నవంబర్ మాసంలో నేను అంతర్జాలంలో ప్రవేశించి మూడు సంవత్సరాలు పూర్తయ్యాయని.

*** BELATED HAPPY BIRTHDAY TO MY BLOG ***

ఈ మూడు సంవత్సరాలలో ముప్పయి వేలకు పైగా వీక్షకులు నా బ్లాగును సందర్శించారు. అంటే సగటున సంవత్సరానికి పది వేల చూపులు నా బ్లాగుపై పడ్డాయన్న మాట.
5 డిసంబర్ 2010 నాడు ఒకే రోజు అత్యధికంగా 183 మంది  నా బ్లాగును దర్శించారు. ఆ రోజు నేను ప్రచురించిన టపా – నా ’వరాహ శతకం’ కావ్యావిష్కరణ సభ విశేషాలతో కూడుకొన్నది.
జూలై 2009 నెలలో అత్యధికంగా 1840 వీక్షణలు నా బ్లాగుపై ప్రసరించాయి. ఆ మాసంలో నేను ప్రచురించిన టపాలు 14. ఆ టపాలలో నా ’వరాహ శతకం’ పద్యాలు, నేను రచించిన కొన్ని ’ఏక వాక్య కవితలు’, ’మహాకవి దాశరథి’ వచన కవిత, ’గాలి బ్రతుకులు’ హాస్య స్ఫోరక పద్యకవిత, ’మతమేదైనా.. కులమేదైనా..’ అభ్యుదయ గీతం ఉన్నాయి. వీటితోబాటు నా ’విజయ విక్రాంతి ( కార్గిల్ యుద్ధంపై దీర్ఘ కవిత )’ పై ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు అందించిన కావ్య సమీక్ష ఉంది.
2008లో నేను ప్రచురించిన టపాలు 5; ప్రసరించిన వీక్షణలు 432.
2009లో నేను ప్రచురించిన టపాలు 92; ప్రసరించిన వీక్షణలు 12243.
2010లో నేను ప్రచురించిన టపాలు 37; ప్రసరించిన వీక్షణలు 8393.
2011లో నేను ప్రచురించిన టపాలు 41; ప్రసరించిన వీక్షణలు 8879.
2012లో నేను ప్రచురించిన టపా 1; ప్రసరించిన వీక్షణలు 271.
మొత్తం మూడేళ్ళ మూడు నెలల్లో  ప్రచురించిన టపాలు 176; మొత్తం వీక్షణలు 30218.

ఇక ముందు కూడ బ్లాగు మిత్రులు నన్నిలాగే ప్రోత్సహిస్తూ, నా రచనలను ఆదరిస్తారని ఆశిస్తూ …

భవదీయుడు

ఆచార్య ఫణీంద్ర

‘ఆధునిక కవిత్రయం’

‘ఆధునిక కవిత్రయం’

రచన: ‘పద్య కళాప్రవీణ’  డా. ఆచార్య ఫణీంద్ర

[పదహారు సంవత్సరాల క్రితం, ఆకాశవాణి-హైదరాబాదు కేంద్రం ద్వారా ప్రసారమైన నా సాహిత్య ప్రసంగం ఇది.]

ఆధునిక యుగంలో ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయిన పద్యాలను అందించిన మహాకవులు ముగ్గురు – దాశరథి, జాషువా, కరుణశ్రీ. వీరిని ‘ఆధునిక కవిత్రయం‘గా భావించవచ్చు. ఆంధ్ర సాహిత్యమున్నంత వరకు మననం చేసుకోదగిన మహాకవులు వీరు. వీరి కలాల నుండి జాలువారిన కొన్ని పద్యాలను కొన్నింటిని మననం చేసుకొని పరవశిద్దాం.
డా. దాశరధి –
 వ్రాసి వ్రాసి పొత్తమ్ములు మాసి నా క
లమ్ములో సిరా యింకి, రక్తమ్ము పోసి
అరుణ తరుణాక్షరాల పద్యాలు కూర్చి
ఆకలికి మాడిపోయెద నీ కొరకయి!  – అని పేదవాని గురించి పరితపిస్తూ కరుణ రసాన్ని కురిపించారు. ‘ఉస్సురనెదవు‘ అన్న శీర్షికలో చార్మినారు వద్ద రాతి కట్టడాల నిర్మాణంలో కష్టించే ఒక కూలిదానిని వర్ణిస్తూ –
 ఓసి కూలిదానా! అరుణోదయాన
మంటి తట్ట నెత్తిన బెట్టి, మరుగు లేని
ఎత్తు రొమ్మును పొంగించి ఎందు కొరకు
ఉస్సురనెదవు? ఆకాశ ముడికిపోవ!  – అంటూ అంగారాన్ని, శృంగారాన్ని కలబోసి అలరించారు. శ్రామిక జనానికి మంచి రోజులు రాబోతున్నాయని సూచిస్తూ –
 అంబర చుంబి సౌధముల కాయువు బోసెడి నీ శ్రమ ప్రభా
వంబు నెరుంగ లేని ధనవంతుల బంగరు పళ్ళెరాలలో
అంబలి పోసి త్రాగు సమయంబులు డగ్గరె లెమ్ము! నీ నవా
స్యంబున రుద్ర నేత్ర విలయాగ్నుల కుంకుమ బొట్టు పెట్టుమా!  అంటూ ఉద్బోధించారు. అణగారిన వర్గాలను ఉద్యమించమని ప్రబోధిస్తూ –
 ఈ సమాజాన దోపిడికే నివాస
మిందు నీ కేమి లేదు; సహింప రాని
వేదనయె గాని వేరు కన్పింపబోదు –
లే! చివాలున లేచి మళ్ళించు రథము!  – అన్నారు మహాకవి డా. దాశరథి.
 నా గీతావళులెంత దూరము ప్రయాణంబౌనొ – అందాక ఈ
భూగోళంబున నగ్గి వెట్టెదను; నిప్పుల్ వోసి హేమంత భా
మా గాంధర్వ వివాహమాడెదను; ద్యోమణ్యుష్ణ గోళమ్ముపై
ప్రాగాకాశ నవారుణాస్ర జల ధారల్ చల్లి చల్లార్చెదన్!  – అంటూ, ఇంకా …
 వీణియ తీగపై పదను పెట్టిన నా కరవాల ధారతో
గానము నాలపించెద; స్వకంఠము నుత్తరణంబొనర్చి స్వ
ర్గానకు భూమి నుండి రస గంగలు చిమ్మెద – పీడిత ప్రజా
వాణికి ‘మైక్‘ అమర్చి అభవాదులకున్ వినిపింప జేసెదన్!  – అని నినదించారా విప్లవ కవి.

ఈనాడు ప్రసిద్ధి చెందిన దళిత వాదానికి మాతృక మహాకవి జాషువా కవితల్లో మనకు దర్శనమిస్తుంది –
 నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి రూప రే
ఖా కమనీయ వైఖరుల గాంచి భళీ భళి యన్నవాడె నీ
దే కులమన్న ప్రశ్న వెలయించి చివుక్కున లేచిపోవుచో,
బాకున గ్రుమ్మినట్లగును – పార్థివ చంద్ర! వచింప సిగ్గగున్!  – అని కుల వ్యవస్థను నిరసించారు జాషువా.
 గవ్వకు సాటి రాని పలుగాకులు మూక లసూయ చేత న
న్నెవ్విధి దూరినన్ నను వరించిన శారద లేచి పోవునే?
ఇవ్వసుధా స్థలిన్ పొడమరే రసలుబ్ధులు? గంట మూనెదన్ –
రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెద నాంధ్ర వాణికిన్!  అని ఆత్మ విశ్వాసాన్ని ప్రకటించారు జాషువా మహాకవి.

ఈ సమాజంలోని అసమానతలకు కర్మఫలం కారణమన్న విషయాన్ని ఎద్దేవ చేస్తూ –
 కర్మ సిద్ధాంతమున నోరు కట్టి వేసి
స్వార్థలోలురు నా భుక్తి ననుభవింత్రు –
కర్మమన నేమొ? దాని కక్ష్య యేమొ?
ఈశ్వరుని చేత ఋజువు చేయించవమ్మ!  అన్నారు.
విగ్రహారాధనను సున్నిత హాస్యంతో మేళవించి నిరసిస్తూ –
 నిన్ను చూపుమని నే నర్చకుని వేడ –
చూడుమంచు గుడిని జూపినాడు!
గుడికి పోయి చూడ గుండ్రాయి వైనాడ
వెందు కిట్టు లైతి, వేడ్పు వచ్చు!  అని హేళన చే్సారు.
 ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని, దుః
ఖిత మతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్ప దీ భరత మేదిని! ముప్పది మూడు కోట్ల దే
వత లెగవడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తు లారునే? – అని మానవత్వం లేని దైవ భక్తి గర్హనీయమని ప్రకటించారు గుర్రం జాషువ.

కరుణ రసాన్ని కలంలో నింపి పద్య కవితలనల్లి మన కందించారు కరుణశ్రీ మహాకవి.
 మా వెల లేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించి పోమె – మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి చీపురుతోడ చిమ్మి మ
మ్మావల పారవోతురు గదా! నరజాతికి నీతి యున్నదా?  అని పుష్పాల ఆవేదనను తన భావనలో పలికించారు కరుణశ్రీ జంధ్యాల పాపయశాస్త్రి. భాగవత కర్త పోతనామాత్యుని వర్ణిస్తూ –
 గంటమొ? చేతిలోది ములుగర్రయొ? నిల్కడ ఇంటిలోననో?
పంట పొలానొ? చేయునది పద్యమొ? సేద్యమొ? మంచమందు గూ
ర్చుంటివొ? మంచె యందొ? కవివో? గడి తేరిన కర్షకుండవో?
రెంటికి చాలియుంటివి సరే! కలమా, హలమా ప్రియంబగున్? – అంటూ కవిగా, కృషీవలునిగా ఆ మహాకవి సవ్యసాచిత్వాన్ని ప్రశంసించారు కరుణశ్రీ.

హత్యను చేయవచ్చిన హంతకుణ్ణి బాధితుడు ప్రశ్నిస్తున్నట్లుగా కరుణశ్రీ రచించిన ఈ పద్యం హృదయాన్ని కలచివేస్తుంది.
 హంత! ఇదేమి? నీదు ప్రణయాంక తటమ్మున నిద్ర పుచ్చి నీ
వింతటి వాడి కత్తి నిటు లేటికి గ్రుచ్చితివోయి? నిర్దయ
స్వాంతుడ! నాదు పేద హృదయమ్మున – చేయి కదల్పబోకు – ప్రా
ణాంతకమైన ఈ నరక యాతన గుండెలు మోయ లేవురా! 

ఆధునిక యుగంలో ఇలాంటి హృద్యమైన పద్యాలను రచించిన ఈ కవిత్రయం ఖ్యాతి తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు అజరామరంగా నిలిచి ఉంటుందన్న విషయం కచ్చితం.

— *** —