డా.ఆచార్య ఫణీంద్రకు ఉగాది పురస్కారం
30 మార్చి 2009 అభిప్రాయములు

అటు పద్యకవిగా రాణిస్తూ – ఇటు వచన, గేయ కవితలలో ప్రయోగాలతో అలరిస్తూ – ప్రముఖ కవిగా గుర్తింపు పొందడమే కాకుండా, “ఇన్నాళ్ళూ ’క్షీణ యుగం’గా పిలువబడుతున్న పందొమ్మిదవ శతాబ్ది తెలుగు సాహిత్యంలో ఎంతో నవ్యత ఉందని, ఇరవయవ శతాబ్ది నవ్య కవిత్వపు బీజాలు పందొమ్మిదవ శతాబ్దిలోనే పడ్డాయి” అని తన సిద్ధాంత గ్రంథం ద్వారా నిరూపించి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ’పి.హెచ్.డి’ పట్టా సాధించిన డా.ఆచార్య ఫణీంద్ర కృషికి గుర్తింపుగా ’విరోధి’ నామ సంవత్సరాది సందర్భంగా ’మానస ఆర్ట్ థియేటర్స్’, హైదరాబాదు వారు ఆయనను ’ఉగాది పురస్కారం’తో సత్కరించారు. ఆదివారం (29 – 03 – 2009) నాడు హైదరాబాదు (చిక్కడపల్లి)లోని నగర కేంద్ర గ్రంథాలయంలో ప్రముఖ చలన చిత్ర దర్శకులు శ్రీ గోపాలకృష్ణ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు, సారస్వత మూర్తి ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఫణీంద్రను సత్కరించారు. ఆచార్య ఫణీంద్రతో బాటు కార్యక్రమ నిర్వాహకులు శ్రీ ’రఘుశ్రీ’ గారు – ప్రముఖ కథకులు శ్రీ ’అంబళ్ళ జనార్దన్’ (ముంబాయి) గారిని, ప్రముఖ రచయిత్రి శ్రీమతి ’జ్వలిత’ (ఖమ్మం) గారిని ’ఉగాది పురస్కారాలతో సత్కరించారు.
( ఫోటో ’ఈనాడు’ దిన పత్రిక సౌజన్యంతో… )




